1 ఆ గొఱ్ఱెపిల్ల ఆ ఏడుముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి- రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని.
2 "మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీటమియ్య బడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను."
3 ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు- రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని.
4 అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్లెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండచేయుటకు ఈ గుఱ్ఱము మీద కూర్చున్నవానికి అధికారమియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.
5 "ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు- రమ్ము అని మూడవజీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండియుండెను."
6 "మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను."
7 ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు- రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.
8 "అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరవు వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికియ్యబడెను."
Four Horsemen of the Apocalypse 9 "ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని."
10 "వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి."
11 తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు వారి వలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.
12 "ఆయన అరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబ మంతయు రక్తవర్ణమాయెను."
13 పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను.
14 మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను.
15 "భూరాజులను, ఘనులును, సహస్రాధిపతులును, ధనికులును, బలిష్టులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండలసందులలోను దాగుకొని,"
16 సింహాసనాసీనుడైయున్న వాని యొక్కయు గొఱ్ఱెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళ జాలిన వాడెవడు?
17 మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. |