1 యేసు మాట్లాడుట ముగించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరి నున్న యూదయ ప్రాంతములకు వెళ్ళెను.
2 బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా వారిని ఆయన స్వస్థపరచెను.
3 "పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి- ''ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా?'' అని అడుగగా, ఆయన-"
4 "''సృజించినవాడు ఆది నుండియు వారిని స్త్రీ గాను పురుషునిగాను సృజించెననియు,"
5 "ఇందునిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏకశరీరులుగా నుండెదరని చెప్పెనని మీరు చదువలేదా?"
6 కాబట్టి వారికను ఇద్దరుగాకాక ఏక శరీరముగా నున్నారు. గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు'' అని చెప్పెను.
7 "అందుకు వారు - ''ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించెను'' అని ఆయనను అడుగగా,"
8 ఆయన - ''మీ హృదయ కాఠిన్యములను బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను. కాని ఆది నుండి ఆలాగు జరుగ లేదు.
9 మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లి చేసుకొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెండ్లి చేసుకొను వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నాను'' అనెను.
10 ''ఇదే భార్యభర్తల కుండు సంబంధమైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదు'' అని శిష్యులాయనతోననిరి.
11 అందుకాయన ''అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటనంగీకరింపనేరరు.
12 "తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు. మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును కలరు, పరలోకరాజ్య నిమిత్తము వివాహము చేసికొనక తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనినవారు కూడయున్నారు. ఈ మాటను అంగీకరించగలవాడు అంగీకరించును గాక'' అని వారితో చెప్పెను."
13 "వారి తలల మీద ఆయన చేతులుంచి ప్రార్థించవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని రాగా, శిష్యులు వారిని వారించి గద్దించిరి."
14 "అప్పుడు యేసు - ''చిన్న పిల్లల నాటంక పరచక నాయొద్దకు రానీయుడి, పరలోకరాజ్యము ఈలాటి వారిదే'' అని చెప్పి,"
15 వారి మీద చేతులుంచి అక్కడ నుండి ముందుకు సాగిపొయెను.
16 "ఒక యౌవనస్థుడాయన యొద్దకు వచ్చి - ''బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలెన''ని అడుగగా, ఆయన -"
17 "''మంచి కార్యముల గూర్చి నన్నెందుకడుగుచున్నావు ? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుము'' అని చెప్పగా, ఏ ఆజ్ఞలని అతడు యేసు నడిగెను. అందుకు"
18 "యేసు- ''నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను సన్మానింపుము,"
19 నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపుము అనునవియే'' అని చెప్పెను.
20 అందుకతడు ఇవన్నియు నేననుసరించుచునే యున్నాను. ఇక నాకు కొదువ యేమి అని ఆయననడిగెను.
21 అందుకు యేసు - ''నీవు పరిపూర్ణు వగుటకు కోరినయెడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుము'' అని అతనితో చెప్పెను.
22 అయితే ఆ యౌవనస్థుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయెను.
23 యేసు తన శిష్యులను చూచి - ''ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతేకాదు
24 ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకన్న ఒంటె సూది బెజ్జములో నుండి దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను'' అనెను.
25 "ఈ మాట విని శిష్యులు మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని ఆయననడుగగా,"
26 యేసు వారిని చూచి - ''మనుష్యుల కిది అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమే'' అని చెప్పెను.
27 "అప్పుడు పేతురు- ''ఇదిగో మేము సమస్తమును విడిచి పెట్టి నిన్ను వెంబడించితిమి గదా, మరి మాకేమి దొరుకున''ని అడుగగా"
28 "యేసు- ''ప్రపంచ పునర్జన్మమందు (పునఃస్థితి స్థాపన మందు) మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముపై ఆసీనుడై యుండు నప్పుడు, నన్ను వెంబడించిన మీ పన్నెండు మంది పన్నెండు సింహాసనములపై కూర్చుండి ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు."
29 "నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను తల్లినైనను, పిల్లలనైనను భూములనైనను, ఇండ్లనైనను, విడిచి పెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును. అంతేగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును."
30 "మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటివారు మొదటివారగుదురు'' అనెను." |